న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: రైతులు తమ డిమాండ్ల సాధన కోసం శుక్రవారం చేపట్టిన గ్రామీణ భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. రైతులు రోడ్లపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకొన్నారు. మార్కెట్లు, వ్యాపార కేంద్రాలు, షాపులను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. పంజాబ్లోని పఠాన్కోట్, తరన్ తరన్, బఠిండా, జలంధర్ తదితర ప్రాంతాల్లో జాతీయ రహదారులను రైతులు స్తంభింపజేశారు. హర్యానాలోని హిస్సార్లో రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ ఉద్యోగులు రైతులకు మద్దతుగా విధులను బహిష్కరించారు.
భారతీయ కిసాన్ యూనియన్ (చరుని) వర్గం రాష్ట్రంలోని పలు టోల్ప్లాజాల వద్ద ధర్నాలు నిర్వహించింది. శంభు సరిహద్దుల్లో ధర్నా నిర్వహిస్తున్న రైతులపై పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ముజఫరాబాద్ వద్ద ఢిల్లీ-డెహ్రాడూన్ క్రాసింగ్లో బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ స్వయంగా ధర్నాలో పాల్గొన్నారు. బిజ్నోర్లో బీకేయూ సభ్యులు చెరకు తూకాలను అడ్డుకొన్నారు. భారత్బంద్లో బీకేయూ (రాజేవాల్), బీకేయూ (దకుండా), బీకేయూ (లఖోవాల్), బీకేయూ (ఖాదియన్), కీర్తి కిసాన్ యూనియన్ తదితర సంస్థలు పాల్గొన్నాయి. ధర్నాలో పాల్గొన్న ఒక రైతు గుండె పోటుతో చనిపోయాడు. దక్షిణాది రాష్ర్టాల్లో భారత్బంద్ పెద్దగా ప్రభావం కనిపించలేదు. రవాణా వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు.
రాబోయే రోజుల్లో ఆందోళనను ఉధృతం చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) శుక్రవారం ప్రకటించింది. చర్చల పేరుతో కేంద్రం రైతులను మభ్య పెడుతున్నదని ఆరోపించింది. హామీల అమలును జాప్యం చేస్తూ చర్చల వాతావరణాన్ని పాడు చేస్తున్నదని విమర్శించింది.
చలో ఢిల్లీ నిరసన చేపట్టిన రైతుల గొంతులను అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని రైతు నాయకుడు శర్వణ్ సింగ్ పంధర్ శుక్రవారం ఆరోపించారు. సుమారు 70 మంది రైతులు, యూట్యూబర్ల సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. మరోవైపు కేంద్ర మంత్రులు, నాయకుల మధ్య నాలుగు దఫాలుగా చర్చలు అసంపూర్తిగా ముగియడంతో ఈ నెల 18న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఈ నెల 15న జరిగిన సమావేశంలో తమ సోషల్ మీడియా ఖాతాలను స్తంభింపచేసిన విషయం మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పారా మిలటరీ దళాలు ప్రయోగించిన టియర్ గ్యాస్, షెల్స్ కారణంగా 70 మంది రైతులు గాయపడ్డారని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.