Tejashvi Surya : కర్ణాటక రాజధాని బెంగళూరులోని సిద్ధన్న లేఅవుట్లో ముకేశ్ అనే మొబైల్ షాప్ యజమానిపై దాడి ఘటనను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ఓటు బ్యాంకు రాజకీయాలు ఇందుకు కారణమని మండిపడ్డారు. ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బాధితుడికి న్యాయం చేయకుండా, నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఈ ఘటనపై బీజేపీ రాజకీయం చేస్తున్నదని కాంగ్రెస్ నేతలు ఆరోపించడంపై కూడా తేజస్వి సూర్య తీవ్రంగా స్పందించారు. ‘రాజకీయాలు ఎవరు చేస్తున్నారు..? ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఘటనపై చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని మేం పోలీసులను కోరుతున్నాం. ఇది మా డిమాండ్. ఇందులో రాజకీయం ఏముంది..? ప్రభుత్వం, మంత్రులు నిందితులను కాపాడేందుకు ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదు. దాడి చేసిన వ్యక్తులు బయట తిరుగుతుంటే.. దాడికి గురైన వ్యక్తిని అరెస్ట్ చేయడం దురదృష్టకరం’ అని సూర్య మండిపడ్డారు.
‘బ్రాండ్ బెంగళూరును నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. నేను ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా. దేశంలో శాంతి భద్రతల పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటే మీరు బ్రాండ్ బెంగళూరును ఎలా నిర్మిస్తారు..? ఓ వర్గంపై ఇలాంటి దాడులు జరుగుతుంటే.. వారు ప్రశాంతంగా తమ పనులను ఎలా చేసుకోగలుగుతారు..? నగరంలో రెండు వారాల క్రితం బాంబు పేలుడు జరిగింది. దానికి ఒక వారం ముందు పాకిస్థాన్ జిందాబాద్ అనే నినాదాలు చేశారు. ఇప్పుడు షాపులో తనపని తాను చేసుకుంటున్న వ్యక్తిపై దాడి జరిగింది. ఇన్ని జరుగుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటోంది..?’ అని తేజస్వి సూర్య నిలదీశారు.
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి..? అల్లర్లను సృష్టించేవాళ్లు, అశాంతిని రేకెత్తించే వాళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు రెచ్చిపోతారు..? దినేశ్ గుండూరావు లాంటి క్యాబినెట్ మంత్రులు నిందితులకు అండగా ఉన్నారే తప్ప.. బాధితుడి పక్షాన ఎందుకు నిలబడలేదు..?’ అని తేజస్వి ప్రశ్నల వర్షం కురిపించారు.