బెంగళూరు, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున కర్ణాటక బీజేపీలో అసంతృప్తి సెగ బయటకు వచ్చింది. పార్టీ నాయకత్వంతో పాటు సీఎం బసవరాజ్ బొమ్మైపై తిరుగుబాటు చేస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐక్యతా జపం చేస్తున్న కమలం పార్టీకి ఇది దెబ్బేనని విశ్లేషకులు పేర్కొన్నారు.
కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో సీఐడీ తనకు క్లీన్చిట్ ఇచ్చినప్పటికీ, తనను తిరిగి క్యాబినెట్లోకి తీసుకోవడం లేదని ఈశ్వరప్ప అసంతృప్తి వెళ్లగక్కారు. వ్యక్తిగత కారణాలతో సెషన్కు హాజరుకావడం లేదని ఈశ్వరప్ప స్పీకర్కు రాసిన లేఖలో పేర్కొన్నప్పటికీ, సోమవారం బాగలకోటలో మీడియాతో మాట్లాడుతూ తమ అసంతృప్తి బయటపెట్టారు. ‘మంత్రివర్గంలోకి తిరిగి తీసుకోకపోవడం నా అభిమానులకు ఆవేదన కలిగించింది. ఇది నాకూ బాధ కలిగించింది. అందువల్లనే బెళగావిలో జరుగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నాను’ అని పేర్కొన్నారు.
మంత్రి పదవిపై సీఎం బొమ్మై ఈరోజే, రేపూ అని చెబుతున్నారే తప్ప.. ఆ పనిచేయడం లేదని అన్నారు. కాగా, బొమ్మై క్యాబినెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిగా గతంలో పనిచేసిన ఈశ్వరప్ప అవినీతి ఆరోపణతో ఈ ఏడాది ఏప్రిల్లో రాజీనామా చేశారు. బిల్లుల మంజూరు కోసం మంత్రి కమీషన్ డిమాండ్ చేశారని ఆరోపిస్తూ సంతోష్ పాటిల్ అనే ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో సీఐడీ కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈశ్వరప్పకు క్లీన్చిట్ ఇచ్చింది.