పట్నా, మే 23: నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బీహార్ పోలీస్ శాఖ ఆర్థిక నేరాల విభాగం కీలక విషయాలను వెల్లడించింది. ప్రశ్నపత్రం కోసం తమ తల్లిదండ్రులు రూ.30 – 50 లక్షల వరకు చెల్లించారని నిందితులుగా ఉన్న విద్యార్థులు ఒప్పుకున్నారని, ఈ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించినట్టు తెలిపింది. సికందర్ యదవేందు అనే లైన్మెన్, దనపూర్ నగర పరిషత్లో జూనియర్ ఇంజినీర్గా పని చేస్తున్న వ్యక్తి తమకు పరీక్షకు ముందే ప్రశ్నపత్రం లీక్ చేశారని విద్యార్థులు అంగీకరించారని వెల్లడించింది.
ఇప్పటికి ఈ కేసులో లైన్మెన్, ఓ డ్రైవర్, విద్యార్థులు, తల్లిదండ్రులు సహా 13 మందిని అరెస్టు చేశామని, బీహార్, ఇతర రాష్ర్టాలకు చెందిన మరో ఆరుగురు విద్యార్థులను నిందితులుగా గుర్తించామని పోలీసులు చెప్పారు. లైన్మెన్కు ప్రశ్నపత్రం ఇచ్చిన గ్యాంగ్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. వైద్యవిద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా మే 5న నీట్ యూజీ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. అయితే, బీహార్లో పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.