న్యూఢిల్లీ, ఆగస్టు 5: రెక్కాడితే డొక్కాడని ఎంతోమంది పేదలకు ఉపాధి హామీ పథకం వరం లాంటిది. పని లేక పస్తులున్న కోట్ల మంది ఈ పథకంతో కాస్త కుదుటపడ్డారు. కానీ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. పేదల ‘ఉపాధి’పై కక్ష కట్టింది. వారి నోటి కాడి బుక్కను లాక్కొంటున్నది. సాఫ్ట్వేర్ మార్పులు, బడ్జెట్లో కోతలు, రెండు పూటలా పనిచేయటం, వేసవి అలవెన్సుల రద్దు వంటి చర్యలతో పేదల కడుపుపై కొడుతున్నది.
దీంతో కడుపు మండిన ఉపాధి కూలీలు ఢిల్లీలో నిరసన గళమెత్తారు. దాదాపు 15 రాష్ర్టాల నుంచి తరలివచ్చిన 500 మంది ఉపాధి కూలీల ప్రతినిధులు.. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎమ్ఎమ్ఎస్) యాప్, కొత్త సర్క్యూలర్ను తొలగించాలని మూడు రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. పాత పద్ధతిలోనే ఉపాధి పని కల్పించాలని అంటున్నారు.
ఉపాధి హామీ పథకం తప్పుదారి పట్టకుండా ఉండేందుకు గత ఏడాది మేలో కేంద్ర ప్రభుత్వం ఎన్ఎమ్ఎమ్ఎస్ యాప్ను తీసుకొచ్చింది. ఆ యాప్ ద్వారా పని ప్రదేశాల్లో కూలీల హాజరును రెండు పూటలా నమోదును కచ్చితం చేసింది. దాని కోసం కూలీలు పనికి వచ్చాక (ఉదయం 11 గంటల్లోపు), పని అయిపోయాక (మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య) సెల్ఫీ దిగాలి.
కానీ, చాలా సందర్భాల్లో ఈ యాప్ పనిచేయటం లేదని విమర్శలు ఉన్నాయి. ఒకటి.. పని ప్రదేశాల్లో ఇంటర్నెట్ లేకపోవటం, రెండోది.. ఇంటర్నెట్ ఉన్నా యాప్ ఓపెన్ కాకపోవటం. దానివల్ల కూలీల హాజరు నమోదు కావటం లేదు. ఫలితంగా వారికి కూలీ డబ్బులు రావటం లేదు.