Electoral Bonds | న్యూఢిల్లీ, మార్చి 14: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ వివరాలను ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. 13న బాండ్ల వివరాలను ఈసీకి ఎస్బీఐ అందించగా, 15న సాయంత్రం 5 గంటల్లోగా ఈ వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా గడువుకు ఒక రోజు ముందే వెబ్సైట్లో ఎన్నికల బాండ్ల డాటాను ఈసీ అప్లోడ్ చేసింది. 2019 ఏప్రిల్ 12 నుంచి 2024 జనవరి 24 మధ్య కాలంలో వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఎస్బీఐ విక్రయించిన బాండ్ల వివరాలు ఇందులో ఉన్నాయి. రెండు భాగాలుగా బాండ్ల వివరాలను వెల్లడించింది. ఒక భాగంలో ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన దాతలు, సంస్థల వివరాలు ఉన్నాయి. రెండో భాగంలో ఈ బాండ్ల ద్వారా నిధులు పొందిన రాజకీయ పార్టీల వివరాలను వెల్లడించింది. అయితే, ఇలా వేర్వేరుగా వివరాలను ఇవ్వడం వల్ల ఏ పార్టీకి ఎవరెవరు నిధులు ఇచ్చారు ? ఎన్ని నిధులు ఇచ్చారు ? అనే వివరాలు వెల్లడి కాలేదు.
దేశంలోనే అత్యధికంగా అధికార భారతీయ జనతా పార్టీ రూ.60,60.5 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందుకుంది. ఎన్క్యాష్ చేసుకున్న బాండ్లలో దాదాపు 47% వాటా బీజేపీదే. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రూ.1600 కోట్లకుపైగా, కాంగ్రెస్ పార్టీకి రూ.1400 కోట్లకుపైగా నిధులు బాండ్ల ద్వారా అందాయి. కాగా, అన్ని పార్టీలకు ఆయా పార్టీల పేర్ల మీద ఎన్నికల బాండ్లు అందగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు మాత్రం అధ్యక్షుల పేర్లతో బాండ్లు అందాయి.
ఎక్కువ ఎలక్టోరల్ బాండ్లను కోయంబత్తూరు కేంద్రంగా పని చేసే ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ కొనుగోలు చేసింది. వేర్వేరు పేర్లతో ఈ సంస్థ కేరళ, సిక్కిం తదితర రాష్ర్టాల్లో లాటరీ వ్యాపారం నిర్వహిస్తున్నది. ఈ సంస్థ రూ.1,368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. లాటరీ కింగ్గా పేరున్న మార్టిన్ శాన్టియాగో ఈ సంస్థకు యాజమాని. ఈ సంస్థపై మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ విచారణ జరుపుతున్నది.
ఈసీ వెల్లడించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలపై కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలను లేవనెత్తింది. దాతల వివరాల్లో 18,871 ఎంట్రీలు ఉండగా, బాండ్లు అందుకున్న వారి వివరాల్లో 20,421 ఎంట్రీలు ఎందుకున్నాయని, ఈ వ్యత్యాసానికి కారణమేంటని కాంగ్రెస్ నేత అమితాబ్ దూబే ఎక్స్లో ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని 2017లో ప్రవేశపెట్టగా ఇప్పుడు వెల్లడించిన వివరాల్లో మాత్రం 2019 ఏప్రిల్ నుంచే ఎందుకున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.
ఎలక్టోరల్ బాండ్ల కేసులో మార్చి 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్నికల కమిషన్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం విచారించనుంది. ఇంతకుముందు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేట్మెంట్లను ఈసీ కార్యాలయంలో పెట్టాలని సుప్రీంకోర్టు మార్చి 11న ఈసీని ఆదేశించింది. అయితే, పారదర్శకత పాటించేందుకు గానూ ఈ డాక్యుమెంట్ల కాపీలను తమ వద్ద పెట్టుకోలేదని, కాబట్టి కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లను తిరిగివ్వాల్సిందిగా సుప్రీంకోర్టును ఈసీ కోరింది.