న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తొలి ఐదు దశల్లో పోల్ అయిన ఓట్ల వివరాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) శనివారం విడుదల చేసింది. పోలింగ్ ముగిసిన దశల్లో పోల్ అయిన ఓట్ల డాటాను ఎవరూ మార్చలేరని తెలిపింది. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ జరిగిందని, అప్పటి నుంచి తాము విడుదల చేస్తున్న డాటా అత్యంత కచ్చితమైనదని, ఎటువంటి వ్యత్యాసాలు, లోపాలు లేనిదని వివరించింది.
ఈ డాటాను ఎన్నికల చట్టాలకు అనుగుణంగా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. పోల్ అయిన ఓట్ల వివరాలను నమోదు చేసే ప్రక్రియ, భద్రపరచే తీరు, ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ ఉండే ఏజెంట్ల వద్ద ఉండే ఫారం 17సీని ఉపయోగించడం వంటివాటి గురించి ఈసీ వివరించింది.
ఫారం 17సీ ఉండటం వల్ల పోల్ అయిన ఓట్ల డాటాను ఎవరూ మార్చలేరని తెలిపింది. పోల్ అయిన ఓట్ల వివరాలను ఈసీ విడుదల చేయాలని కోరిన పిటిషనర్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. నియోజకవర్గాలవారీగా మొత్తం ఓటర్లు, పోల్ అయిన ఓట్ల వివరాలు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. యాప్లో ఈ డేటా ప్రజలకు అందుబాటులో ఉన్నాయంది. తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తూ, ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది.