చెన్నై, ఏప్రిల్ 20: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి నియామకానికి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయడానికి ‘రెండు ఆకుల’ గుర్తును కూడా పళనిస్వామి వర్గానికి కేటాయించింది. దీంతో ఇంతకాలంగా అన్నాడీఎంకే నాయకత్వం విషయంలో మాజీ సీఎంలు పళనిస్వామి, పన్నీర్సెల్వం మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన ముగిసింది. పార్టీ పగ్గాలు పూర్తిస్థాయిలో పళనిస్వామి చేతుల్లోకి వచ్చినట్టయ్యింది. జయలలిత మరణం, శశికళ జైలుకు వెళ్లడం వంటి పరిణామాల తర్వాత అన్నాడీఎంకేలో ఈ ఇద్దరు కీలక నేతలుగా ఎదిగారు. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయే వరకు కలిసి ఉన్నట్టు కనిపించినా, ఎన్నికల్లో ఓడిన తర్వాత రెండు వర్గాలుగా విడిపోయారు. పార్టీ పగ్గాల కోసం ఇద్దరి మధ్య సాగిన పోరులో పళనిస్వామి ఇప్పుడు పైచేయి సాధించారు.