Road Accidents | భారత్లో ప్రతి ఏటా ఐదులక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే, తరుచుగా జరిగే ప్రమాదాలకు ఇంజినీరింగ్ లోపమే కారణమని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేందుకు బ్లాక్ స్పాట్స్ను తొలగించేందుకు ఇంజినీర్లు కృషి చేయాలని ఆయన సూచించారు. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ 82వ వార్షిక సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ వ్యవయాన్ని తగ్గించుకోవాలని.. ప్రత్యామ్నాయాలను వినియోగిస్తూ అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీని వినియోగించి నాణ్యతలో రాజీపడకుండా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ‘దేశంలో ఏటా 5లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. 1.5లక్షల మంది మరణిస్తున్నారు.
3లక్షల మంది గాయపడుతున్నారు. దీంతో దేశ జీడీపీకి 3శాతం నష్టం వాటిల్లుతోంది. అయితే, ప్రతి ప్రమాదానికే డ్రైవర్నే నిందిస్తారు. బలిపశువులా చేస్తారు’ అన్నారు. ప్రమాదాలకు రోడ్ ఇంజినీరింగే కారణమని.. రోడ్లు నిర్మించే సమయంలో ప్రమాదాల నివారణకు తగిన సరైన ఇంజినీరింగ్ ఉండాలన్నారు. ‘నాకు కూడా ప్రమాదం జరిగి నాలుగు ఎముకలు విరిగిపోయాయి. చాలా మంది చనిపోతున్నారు. 18-34 ఏళ్ల మధ్య వయస్కులే 60శాతం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇందులో చాలామంది ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు. ఇది మంచిదేనా?’ అంటూ ప్రశ్నించారు. డిజైన్, నాణ్యత విషయంలో రాజీపడకుండా డిటైల్డ్ ప్రాజెక్ట్ (డీపీఆర్)లో నైపుణ్యం అవసరమని నొక్కి చెప్పారు.
నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణ వ్యయాన్ని తగ్గించాలని.. ఆలోచనా ధోరణిని మార్చుకుని సానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్ట్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలంటే నిర్మాణ వ్యయాన్ని తగ్గించడం కీలమన్నారు. భూసేకరణ, పర్యావరణ క్లియరెన్స్ జాప్యం కారణంగా చాలా రెట్లు పెరుగుతుందన్నారు. స్టీల్, సిమెంట్ కంపెనీల గుత్తాధిపత్యం చెలాయిస్తూ ఎలాంటి కారణం లేకుండా రేట్లను పెంచుతూనే ఉన్నాయన్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 78వేల చెట్లను నాటిందన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలని, మెటీరియల్ని రీసైకిల్ చేయడంతోపాటు నాణ్యత విషయంలో రాజీపడకుండా తయారీ వ్యయాన్ని తగ్గించాలని.. ఈ ఎజెండా గురించి ఆలోచించాల్సిందిగా కోరుతున్నట్లు ఆయన తెలిపారు. సమయమే అతిపెద్ద ఆస్తి అని, ఖర్చులు తగ్గించుకోవడానికి ఒక ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా కృషి చేయాలని అన్నారు. ఉత్తరకాశీ సొరంగం ఘటనపై స్పందిస్తూ.. ప్రాణాలను పణంగా పెట్టి రక్షించిన వారిని మరువలేమన్నారు. ప్రమాదంలో 41 మంది కూలీలు చిక్కుకోగా, 17 రోజుల ప్రయత్నాల తర్వాత వారిని రక్షించినట్లు పేర్కొన్నారు.