న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్చరికలు చేసింది. ఏ విధమైన సమ్మెలో (Strike) పాల్గొనవద్దని, ఆందోళనలు చేయవద్దని ఆదేశించింది. అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరికలు చేసింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సోమవారం మార్గదర్శకాలు జారీచేసింది. ఏ రూపంలో అయినా ఏ ఉద్యోగి సమ్మె చేసినా.. అతనిపై వేతన తగ్గింపుతో పాటు క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయని అందులో పేర్కొన్నది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మూకుమ్మడి సెలవు, సిట్-డౌన్(డిమాండ్లు నెరవర్చే వరకు పనిప్రదేశం నుంచి కదలకపోవడం), గో-స్లో(తమ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చేందుకు పని నెమ్మదిగా చేస్తూ నిరసన తెలుపడం) వంటి ఏ రూపంలోనైనా సమ్మె లేదా ఆందోళనలు చేయడాన్ని నిషేధించింది. ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ మంగళవారం జిల్లా స్థాయిలో పెద్దయెత్తున ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీచేయడం గమనార్హం.