ఇంఫాల్: మణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 54కు చేరింది. 150 మందికి పైగా గాయాలయ్యాయి. ఇవి ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న గణాంకాలు మాత్రమే. మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని అనధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ఇంఫాల్ లోయలో భద్రతా సిబ్బంది పహారా మధ్య జనజీవనం సాధారణ స్థితికి చేరుకొంటున్నది. శనివారం షాపులు, మార్కెట్టు తెరుచుకొన్నాయి. వాహనాలు రోడ్ల పైకి వచ్చాయి.
ఐదుగురు మిలిటెంట్లు హతం
శుక్రవారం రాత్రి చురాచాంద్పుర్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో పర్వత ప్రాంతానికి చెందిన ఐదుగురు తీవ్రవాదులు మరణించగా, ఇండియా రిజర్వ్ బెటాలియన్కు చెందిన ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. సైటన్, టోర్బంగ్ ఏరియాల్లో రెండు ఎన్కౌంటర్లు జరిగాయని తెలిపారు. కాగా, ఘర్షణల ప్రభావిత ప్రాంతాల నుంచి 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, మరికొంత మందికి ఆర్మీ క్యాంపుల్లో ఆశ్రయం కల్పించామని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఉద్రిక్తతలతో ఇతర రాష్ర్టాలకు..
మరోవైపు మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు యువకులతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు ఇంఫాల్ ఎయిర్పోర్టుకు వెళ్తున్నారు. కాగా, మణిపూర్కు రైలు సర్వీసులను కూడా రైల్వే శాఖ అధికారులు రద్దు చేశారు.
ఐటీ అధికారి హత్య
ఇంఫాల్లో ఐటీ శాఖకు చెందిన లమింతాంగ్ హాకిప్ అనే ఓ అధికారిని అల్లరి మూకలు హత్య చేశాయి. అధికారి ప్రభుత్వ క్వార్టర్స్లోని తన నివాసంలో ఉండగా.. ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చిన మైతీ వర్గానికి చెందిన మూకలు తీవ్రంగా దాడి చేసి చంపేశారు. లమింతాంగ్ ఇంఫాల్లో ట్యాక్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. లమింతాంగ్ హత్యను ఐఆర్ఎస్ అసోసియేషన్ ఖండించింది.