Nanded | ముంబై, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానల్లో మరణ మృదంగం మోగుతున్నది. కొద్దిరోజుల క్రితం థాణే దవాఖానలో 36 గంటల్లో 22 మంది రోగులు మరణించిన ఘటన మరువక ముందే.. నాందేడ్లో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. నాందేడ్ ప్రభుత్వ దవాఖానలో 24 గంటల వ్యవధిలో 24మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో 12 మంది నవజాత శిశువులు ఉండటం అందర్నీ కలిచివేసింది. ప్రభుత్వ దవాఖానాల్లో వసతులలేమి, సిబ్బంది కొరతే ఈ మరణాలకు కారణమని బాధిత కుటుంబాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై సీఎం ఏక్నాథ్ షిండేను విలేకరులు ప్రశ్నించగా, ఆయన స్పందించిన తీరు వివాదాస్పదమైంది. ఘటనపై తనకు సమాచారం లేదని సీఎం వ్యాఖ్యానించారు. అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుం టానని ఆయన చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ మరణాలకు బాధ్యత వహించాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఆరోపించారు.
అంతా పేదలే..
పర్భణి, హింగోళి, యావత్మాల్ జిల్లాల సరిహద్దు గ్రామాల నుంచి వందలాది మంది పేదలు నిత్యం నాందేడ్లోని డాక్టర్ శంకర్రావు చౌహాన్ దవాఖానకు వస్తుంటారు. పాముకాటుకు గురైన వారు ఎక్కువగా వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. సరైన చికిత్స అందక, మందులు లేక 12 మంది నవజాత శిశువులు మరణించారని బాధిత తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. 500 మంది పేషెంట్లకు సరిపోయే ఈ హాస్పిటల్లో 1300మంది రోగులు అడ్మిట్ అయ్యారని, నర్సుల్లో చాలామంది బదిలీపై వెళ్లిపోగా, ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసింది.
మందులు కొనలేకపోయాం..
జిల్లా ప్లానింగ్ కమిటీ యంత్రసామగ్రి, ఔషధాలు, ఆపరేషన్ పరికరాలు, ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు కోసం రూ.4 కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే ఈ ఫండ్స్ సాంకేతిక కారణాలతో మంజూరు కాకపోవడంతో మందులు కొనుగోలు చేయలేదు. దాని వలన రోగులు బయట నుంచి మందులు కొనుకోవాల్సి వస్తున్నది. కొద్ది రోజుల నుంచి మా దవాఖానకు అవసరం ఉన్న మందులను పక జిల్లా నుంచి తెప్పించి వాడుతున్నాం.
– డాక్టర్ ఎస్.ఆర్ వాకోడే, నాందేడ్ జిల్లా దవాఖాన సూపరింటెండెంట్