Karnataka | హైదరాబాద్, మార్చి 1 (స్పెషల్ టాస్క్ బ్యూరో,నమస్తే తెలంగాణ): ఐదు గ్యారెంటీల పేరిట కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హామీలను సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. గ్యారెంటీల అమలుకు అయ్యే వ్యయాన్ని తగ్గించుకోవడానికి, లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు తీసుకొచ్చింది. ఉచిత విద్యుత్తు అంటూ ఊదరగొట్టి ఛార్జీల పెంపునకు తెర తీసింది. మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామన్న ‘గృహలక్ష్మి’ స్కీమ్కు కొత్త ఆంక్షలు జోడించింది. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సర్వీసులంటూ ఊరించిన ‘శక్తి’ స్కీమ్లో వయసు, వృత్తి అంటూ కొత్త పరిమితులు విధించనుంది! నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్న ‘యువనిధి’, పేదలకు ఉచిత బియ్యమని ఊదరగొట్టిన ‘అన్నభాగ్య’ ఇలా ప్రతి పథకంలోనూ కోతలు విధిస్తున్నది. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వంపై కన్నడిగులు భగ్గుమంటున్నారు. ఎన్నికల సమయంలో హామీల పేరుతో ఆశ చూపిన కాంగ్రెస్.. ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకొచ్చి మోసం చేసిందంటూ మండిపడుతున్నారు.
గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామంటూ ‘గృహజ్యోతి’ పేరిట కాంగ్రెస్ హామీనిచ్చింది. అధికారంలోకి రాగానే కొర్రీలు పెట్టింది. 2022 నుంచి 2023 మార్చి వరకు గృహ విద్యుత్తు వినియోగం సగటున 200 యూనిట్లకు మించని కుటుంబాలు మాత్రమే ఈ స్కీమ్కు అర్హులంటూ సర్కారు తొలి షాక్ ఇచ్చింది. తర్వాత 200 యూనిట్ల స్థానంలో 165 యూనిట్లను కటాఫ్గా కుదించింది. వినియోగదారుడికి పెండింగ్ బిల్స్ ఉంటే ఈ పథకానికి అర్హులు కారని మరో మెలిక పెట్టింది. కరెంటు చార్జీలు పెంచింది. మీటర్ల లెక్కలు కావాలన్నది. ఇక, ‘శక్తి’ స్కీమ్ వ్యయ నియంత్రణలో భాగంగా ఇప్పటికే అనేక మార్గాల్లో బస్సు సర్వీసులను నిలిపేసింది. గతంలో 5-10 నిమిషాలకో బస్సు వచ్చేదని, ఇప్పుడు 40 నిమిషాలకు కూడా రావట్లేదని ‘ది హిందూ’ మీడియా సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో మహిళలు మండిపడ్డారు.
డిగ్రీ పాసైన యువతకు నెలకు రూ.3 వేలు, డిప్లొమా చేసిన వారికి రూ.1,500 భృతిగా ఇస్తామన్న ‘యువనిధి’ స్కీమ్ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఉద్యోగ నోటిఫికేషన్ల జాడ కూడా లేదు. ‘అన్నభాగ్య’ గ్యారెంటీ కింద ఉచితంగా బియ్యం సరఫరా చేస్తామన్న సర్కారు.. కిలో బియ్యానికి రూ.34 చొప్పున 5 కిలోలకు మాత్రమే రూ.170 పేదలకు జమ చేస్తున్నది. అయితే, బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం ధర రూ. 60 పైనే ఉన్నదని, ప్రభుత్వం ఇచ్చే రూ. 170తో నెలంతా ఎలా బతకగలమని ప్రజలు మండిపడుతున్నారు. ‘గృహలక్ష్మి’ పథకానికి రిజిస్ట్రేషన్ల నంబర్లతో ఫోన్లకు మెసేజీలు కూడా వచ్చాయి. అయితే, డబ్బులు మాత్రం వందల మందికి మాత్రమే జమయ్యాయి. అదీ ఒక్క నెల మాత్రమే.
గ్యారెంటీల అమలు గుదిబండగా మారిందని సీఎం సిద్ధరామయ్య ఆర్థిక సలహాదారు బసవరాజ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘5 గ్యారెంటీలను కొనసాగించాలంటే ఏటా రూ.58 వేల కోట్లు అవసరం. ఇది ఖజానాపై పెను భారమే. గ్యారెంటీల వ్యయాన్ని తగ్గించుకోడానికి స్కీమ్ల నిబంధనల్లో ఏమేం మార్పుచేర్పులు తీసుకురావొచ్చనేది చర్చిస్తున్నాం.’ అని బసవరాజ్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 5 హామీలను అమలు చేయడానికి నిధులను ఖర్చు చేసుకుంటూ పోతే అభివృద్ధి పనులు పడకేయడం ఖాయమన్న ఆందోళనను కూడా వ్యక్తం చేశారు.