న్యూఢిల్లీ, జనవరి 1: కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదన్న విమర్శల్ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ కొట్టిపారేశారు. న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం చర్చల్ని బహిరంగ పర్చలేమని, నియామక ప్రక్రియను రికార్డు చేయటం, డాక్యుమెంటేషన్ చేయటమనేది భారత రాజ్యాంగంలో లేదని ఆయన అన్నారు. జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, స్వలింగ సంపర్కుల వివాహం.. తదితర అంశాలపై పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు విశ్వసనీయతను కొనసాగిస్తున్నామని, న్యాయవాదుల అభిప్రాయం మేరకు కేసుల కేటాయింపు ఉండదని సీజేఐ స్పష్టం చేశారు. ‘కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదన్న విమర్శ సరైంది కాదు. అత్యంత పారదర్శకంగా కొలీజియంను నిర్వహిస్తున్నాం’ అని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి కేసులో రాజ్యాంగం, చట్టం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పులు విమర్శలకు దారితీయటంపై సీజేఐ మాట్లాడుతూ, ‘భారత రాజ్యాంగం, చట్ట ప్రకారం విచారణ జరిపామా? తీర్పు ఉందా? అన్నదే చూడాలి. అంతే తప్ప.. విమర్శలను దృష్టిలో పెట్టుకొని విచారణ చేపట్టడమనేది సరైన విధానం కాదు. వాటికి స్పందించాల్సిన అవసరం కూడా లేదు. తీర్పు ఎందుకు అలా వచ్చిందన్న కారణం జడ్జిమెంట్లో ఉంటుంది’ అని అన్నారు. స్వలింగ సంపర్కుల వివాహం కేసును ప్రస్తావిస్తూ, ‘ఒక కేసులో వెలువడే అంతిమ తీర్పు జడ్జిపై వ్యక్తిగత ప్రభావం ఉండరాదు. అంతిమ ఫలితంపై విచారించాల్సిన పని లేదు. వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.