న్యూఢిల్లీ, ఆగస్టు 1: రాష్ర్టాలు తీసుకునే రుణాలపై సవాలక్ష కొర్రీలు పెట్టే కేంద్రంలోని మోదీ సర్కారు.. తాను మాత్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.155.6 లక్షల కోట్లకు చేరాయి. ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 57.1 శాతానికి సమానమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం పార్లమెంట్లో ప్రకటించారు. నిరుడు ఇదే సమయానికి కేంద్ర ప్రభుత్వ అప్పులు జీడీపీలో 61.5 శాతంగా ఉన్నట్టు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు జీడీపీలో దాదాపు 28 శాతంగా ఉన్నట్టు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో జీఎఫ్సీఎఫ్ (గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్) స్థిర ధరల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.45.41 లక్షల కోట్లుగా ఉన్నాయని, ప్రాథమిక అంచనాల ప్రకారం ఇవి గత ఆర్థిక సంవత్సరంలో రూ.54.35 లక్షల కోట్లకు పెరిగాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.