MSP | న్యూఢిల్లీ, మార్చి 8: నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి పంట నుంచి రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడానికి కేంద్రం కొత్త ప్రణాళికను అమలు చేయనున్నట్టు తెలుస్తున్నది. రైతులు వరికి బదులుగా కంది, మినుము, ఎర్ర పప్పు, మక్కజొన్న, పత్తి పంటలు పండిస్తే ఐదేండ్ల పాటు కనీస మద్దతు ధర ఇచ్చి పంటను కొనుగోలు చేయనుంది. కేంద్ర సంస్థలైన జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య(ఎన్సీసీఎఫ్), జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య(నాఫెడ్) రైతులతో ముందస్తు ఒప్పందం చేసుకుంటాయి. ఇందుకు గానూ ప్రభుత్వం ఒక పోర్టల్ను ప్రారంభించనుంది. ఈ పోర్టల్లో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వరికి బదులుగా ఇతర పంటలు పండించే రైతుల నుంచి ఎలాంటి పరిమితులు లేకుం డా కనీస మద్దతు ధర ఇచ్చి పంట కొనుగోలు చేయాలని కేంద్రం భావిస్తున్నది.
ప్రస్తుతం ఆందోళన చేస్తున్న రైతులు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా, రైతు నేతలతో చర్చల సమయంలో కేంద్రమంత్రులు ఈ కొత్త ప్రతిపాదన చేశారు. అయితే, రైతు నేతలు ఈ ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ కేంద్రం మాత్రం అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. తద్వారా వ్యవసాయానికి నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు పప్పుదినుసుల కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని కేంద్రం భావిస్తున్నది. దీంతో పాటు ఇథనాల్ తయారీకి బియ్యానికి బదులుగా మక్కజొన్న వినియోగాన్ని పెంచవచ్చని అంచనా వేస్తున్నది.