న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) షాక్ ఇచ్చింది. పలు అనుమానాలు, అభ్యంతరాల మధ్య అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్రం రూ.72 వేల కోట్లతో చేపట్టదలచుకొన్న భారీ ప్రాజెక్టుపై స్టే విధించింది. ప్రాజెక్టు అనుమతుల విషయంలో పలు లోపాలు గుర్తించిన ఎన్జీటీ.. ఆదిమవాసులు నివసించే, అంతరించిపోతున్న వృక్ష, జంతు జాతులు ఉండే అటవీ ప్రాంతంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై పునఃపరిశీలన చేసేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి వరకు పనులు నిలుపుదల చేయాలని పేర్కొన్నది.
ఈ కమిటీకి కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. రెండు వారాల్లోగా సమావేశం అవ్వాలని, రెండు నెలల్లో అప్పగించిన పని పూర్తి చేయాలని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ ఆదేశించారు. ప్రాజెక్టు విషయంలో పిటిషనర్లు ప్రసావించిన పలు లోపాలను ప్రస్తావించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం హడావుడిగా అనుమతులు మంజూరు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పిటిషన్దారులు ప్రస్తావించిన లోపాలను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ప్రాజెక్టులో కొంత భాగం కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో ఉన్నదని, అక్కడ పోర్టు నిర్మాణం నిషేధితమని పేర్కొన్నది. ఇంకా, పగడపు కాలనీ తరలింపు విషయంలో కూడా అనుమతులను కమిటీ పునఃపరిశీలిస్తుందని బెంచ్ తెలిపింది.
ప్రాజెక్టులో భాగంగా కేంద్రం గ్రేట్ నికోబార్ దీవుల్లో వచ్చే 30 ఏండ్లలో పోర్టు, ఎయిర్పోర్టు, పవర్ ప్లాంట్లను నిర్మించాలనుకొంటున్నది. అయితే ఈ ప్రాజెక్టుకు అనుమతులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు నిపుణులు, మాజీ బ్యూరోక్రాట్లు గతంలో రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుతో అక్కడ నివసించే మూలవాసులు తమ అస్థిత్వం కోల్పోతారని, అటవీ భూమి, జీవవైవిధ్యం బుగ్గిపాలు అవుతుందని, ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని కోరారు.