న్యూఢిల్లీ: సీబీఐని భారత ప్రభుత్వం నియంత్రించదని సుప్రీం కోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విచారణలో భాగంగా గురువారం ఈ వివరణ ఇచ్చింది. తమ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయకుండా సాధారణ సమ్మతిని(జనరల్ కన్సెంట్) ఉపసంహరించుకున్నా .. సీబీఐ ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తున్నదని, దర్యాప్తు చేపడుతున్నదని పేర్కొంటూ బెంగాల్ సర్కారు ఆర్టికల్ 131 కింద కేంద్రంపై కేసు పెట్టింది.
దీనిపై కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం కేసులు నమోదు చేయదని, సీబీఐ కేసులు నమోదు చేస్తుందని తెలిపారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 131ను దుర్వినియోగం చేయకుండా చూడాలని కోర్టుకు విన్నవించారు.