న్యూఢిల్లీ: ఆధార్ కార్డులతో అనుసంధానించని 11.5 కోట్ల పాన్కార్డులను కేంద్రం డీ యాక్టివేట్ చేసింది. ఆర్టీఐ విచారణలో ఈ విషయం వెల్లడైంది. ‘ది హిందూ’ ప్రచురించిన కథనం ప్రకారం ఇండియాలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులుండగా అందులో 13 కోట్ల కార్డులు ఆధార్తో లింక్ కాలేదు. 2017 జూలై 1 తర్వాత జారీ చేసిన పాన్ కార్డులు మాత్రం ఆటోమేటిగ్గా ఆధార్తో లింక్ అవుతాయి.
డీ యాక్టివేట్ అయిన కార్డులను రీ యాక్టివేట్ చేసుకోవడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు రూ.1000 జరిమానాగా విధించింది. ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఈ విషయాన్ని విమర్శించారు. కొత్త పాన్కార్డు పొందడానికి రూ.91 ఖర్చవుతున్నప్పుడు దానికి పది రెట్లు ఎక్కువ మొత్తాన్ని రీ యాక్టివేట్ కోసం కేంద్రం జరిమానాగా విధిస్తున్నదన్నారు.