న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: సుప్రీంకోర్టుకు మరో ఇద్దరి న్యాయమూర్తుల నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రాజేశ్ బిందాల్, గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ అరవింద్ కుమార్లకు సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం ట్విట్టర్లో వెల్లడించారు. దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య పూర్తిస్థాయి(మంజూరు బలం-34)కి చేరినట్టు అయింది. కొత్తగా జడ్జిలుగా నియమితులైన వారు సోమవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీరిద్దరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం జనవరి 31న సిఫారసు చేసిన విషయం తెలిసిందే.