హైదరాబాద్(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): నిద్ర మనుషుల ప్రాథమిక అవసరమని బాంబే హైకోర్టు తెలిపింది. విచారణ పేరిట రాత్రిళ్లు వేధించడం సరైన పద్ధతి కాదని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది. ఓ కేసు విచారణ సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఈ మేరకు హితవు పలికింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా కిందటేడాది రామ్ కోటుమల్ ఇస్రానీ అనే 64 ఏండ్ల వ్యక్తిని ఈడీ అరెస్టు చేసింది. అరెస్టును సవాల్ చేస్తూ ఇస్రానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
గత ఆగస్టు 7న తనను రాత్రంతా విచారించిన ఈడీ.. ఆ మర్నాడు తెల్లవారుజామున అరెస్టు చేసినట్టు పేర్కొన్నాడు. దీన్ని పరిశీలించిన ధర్మాసనం ఇస్రానీ పిటిషన్ను కొట్టేసింది. అయితే, అతడిని రాత్రిళ్లు ఈడీ విచారించడాన్ని మాత్రం తప్పుబట్టింది. దీంతో పిటిషనర్ అనుమతి తీసుకొన్నాకనే రాత్రి విచారణ చేసినట్టు ఈడీ కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన కోర్టు.. నిందితుడి అంగీకారం ఉన్నప్పటికీ రాత్రిళ్లు విచారణ చేపట్టడం సరైనది కాదని తేల్చిచెప్పింది. ఇది ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుందన్న ధర్మాసనం.. పగటిపూట మాత్రమే వాంగ్మూలాలను రికార్డు చేయాలని సూచించింది.