భోపాల్: బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపుపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. (BJP workers protest) తమ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నవంబర్ 17న జరుగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 92 మంది అభ్యర్థులతో కూడిన ఐదవ జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టికెట్ ఆశించిన అభ్యర్థుల మద్దతుదారులు, బీజేపీ కార్యకర్తలు పలు చోట్ల నిరసనకు దిగారు. ఆ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దీనిపై స్పందించారు. మధ్యప్రదేశ్లో రెండు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. అందరూ మంచి అభ్యర్థులే అని అన్నారు. చాలా మంది టికెట్లు అడగడం వల్ల కొన్ని విభేదాలు ఉన్నాయని చెప్పారు. అయితే పార్టీలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. మధ్యప్రదేశ్లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.