BJP | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రధాన మీడియాను తన నియంత్రణలో పెట్టుకొన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుతం.. విదేశీ మీడియాపైనా ఆంక్షలు విధిస్తున్నది. పాలనా వైఫల్యాలను, విధానాల తప్పులను కప్పిపుచ్చునేందుకు విదేశీ మీడియా జర్నలిస్టులకు విధి నిర్వహణలో అడ్డంకులు సృష్టిస్తున్నది. సమస్యాత్మక, రక్షిత, వ్యూహాత్మక ప్రాంతాలు అంటూ.. ట్రావెల్ పర్మిట్లు ఇతరత్రా పేరుతో వారి విధులకు ఆటంకాలు కలిగిస్తున్నది. 2016 నుంచి ఈ ఆంక్షలు, అడ్డంకుల పర్వం నడుస్తున్నట్టు సర్వేలో తేలిందని న్యూస్ వెబ్సైట్ స్క్రోల్ తన కథనంలో పేర్కొన్నది. గుజరాత్ అల్లర్లలో మోదీ పాత్రపై బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధం నేపథ్యంలో ఆంక్షల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ముస్లింలపై హింసకు సంబంధించి కథనాలు రాయవద్దని ఓ యూరోపియన్ వార్తా సంస్థలో పనిచేసే ఓ పాత్రికేయుడికి తన దేశంలోని భారత రాయబార కార్యాలయం నుంచి ఈమెయిల్ వచ్చినట్టు సర్వేలో తేలిందని వెల్లడించింది. 2020 జనవరిలో జరిపిన సర్వేలో ఢిల్లీలోని విదేశీ పాత్రికేయుల క్లబ్ సభ్యులతో పాటు 40 మంది విదేశీ జర్నలిస్టుల అభిప్రాయలు సేకరించినట్టు పేర్కొన్నది. 2019లో జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు చేసినప్పటి నుంచి విదేశీ పాత్రికేయులను అక్కడ పర్యటించేందుకు, స్థానిక ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు కేంద్రం అనుమతించలేదని చెప్పారని వివరించింది. జమ్ముకశ్మీర్ను రక్షిత ప్రాంతాల జాబితాలో చేర్చి, అక్కడకు వెళ్లాలంటే విదేశీ జర్నలిస్టులు హోంశాఖ అనుమతి తీసుకోవాలనే నిబంధన విధించింది.
ఆంక్షలు, అడ్డంకుల తంతు 2016 నుంచే ఉన్నదని, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, మణిపూర్లో పర్యటించాలంటే అనుమతి తీసుకోవాలని విదేశాంగ శాఖ విదేశీ పాత్రికేయులందరికీ ఆదేశాలు జారీచేసిందని స్క్రోల్ తెలిపింది. 2018లో మిజోరం, అరుణాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, రాజస్థాన్లకు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సిందేనంటూ కేంద్రం హుకుం జారీ చేసిందని పేర్కొన్నది. వీసాల గడువు పొడిగింపును కూడా కేంద్రం మరో ఆయుధంగా వాడుకుంటునట్టు విదేశీ పాత్రికేయులు తెలిపారని, ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాసే జర్నలిస్టులకు వీసా పొడిగింపును 3-6 నెలలు మాత్రమే ఇచ్చేదని పలువురు జర్నలిస్టులు పేర్కొన్నారని స్క్రోల్ తన కథనంలో వివరించింది.