న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. పలు రకాల పనుల నిమిత్తం పార్టీ ఇచ్చిన చెక్లు పనిచేయలేదు. దీంతో పార్టీ కోశాధికారి అజయ్మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ శాఖ ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడిందని ఆరోపించారు.
ఎన్నికల ముందు ఇలా జరగటంతో కాంగ్రెస్ పార్టీ షాక్ తిన్నది. అయితే 210 కోట్ల పన్ను రాబట్టుకునే అంశంలో భాగంగా ఐటీ శాఖ కాంగ్రెస్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్టు తెలిసింది. ఈ అంశంపై పార్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేసింది. ఖాతాలను పునరుద్ధరించిన ట్రిబ్యునల్.. ఈ అంశంపై వచ్చే వారం విచారిస్తామని వెల్లడించింది. ఐటీ శాఖ చర్యను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు తప్పుపట్టారు. ఇది ప్రజాస్వామ్యంపై ప్రభుత్వం చేసిన దాడిగా అభివర్ణించారు.