లేహ్, జూలై 4: జమ్ముకశ్మీర్ నుంచి లఢక్ను వేరు చేసి మూడేండ్లు అవుతున్నది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ.. లఢక్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. 2019 ఆగస్టు 5న ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుని అమలుపరిచింది. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఆ సందర్భంగా మాటిచ్చింది. చెడులో కూడా మంచి వెతుక్కోవాలన్నట్టు లఢక్ ప్రజలు కూడా ‘ఏదో మార్పు జరుగుతుంది’.. తమ జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతాయని ఆశించారు. కానీ బీజేపీ వల్ల తమకు ఒరిగిందేమీ లేదని కొద్ది కాలంలోనే అక్కడి ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అర్థమైంది. లఢక్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారి మూడేండ్లు అవుతున్నా ఉద్యోగాల ఊసే లేదు.
ఉద్యోగాలు లేక విలవిల
మూడేండ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందని ఎదురుచూస్తున్న యువతకు నిరాశే ఎదురవుతున్నది. నిరుద్యోగులు పొట్టకూటి కోసం ఏదో ఒక పని చేసి బతుకీడ్చుకురావాల్సి వస్తున్నది. పైగా లఢక్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా లేదు. జమ్ముకశ్మీర్ పీఎస్సీనే భర్తీ చేయాల్సి ఉన్నది. మూడేండ్లుగా ఉద్యోగాల కోసం లఢక్ యువతీయువకులు రోడ్డెక్కి మరీ నిరసనలు చేస్తున్నారు.
ఆమడ దూరంలో అభివృద్ధి
లఢక్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారితే అభివృద్ధి పరుగులు తీస్తుందంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు కిక్కురుమనట్లేదు. మూడేండ్లలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా లఢక్ పరిస్థితి ఉంది. అభివృద్ధి జరిగితేనైనా కనీసం ఉపాధి దొరుకుతుందని ఆశించిన యువతకు కేంద్రం అది కూడా అందకుండా చేసింది. ఇటు సరైన ఉపాధి లేక, అటు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక చిన్నా చితక పనులు చేసి బతకాల్సి వస్తున్నదని ఉద్యోగార్థులు వాపోతున్నారు.
ఇంటీరియర్ డిజైనర్ కావాలనుకున్నా.. కానీ,
ఇంటీరియర్ డిజైనర్ కావాలని నా కల. లఢక్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిందనగానే నా కలలకు రెక్కలొచ్చాయి. అభివృద్ధి జరిగి మంచి కంపెనీలు పెట్టుబడులు పెడుతాయని ఆశించా. కానీ మూడేండ్లలో ఏమీ జరుగలేదు. చివరికి గత్యంతరం లేక ఓ కిరాణా కొట్టులో క్యాషియర్గా పనిచేస్తున్నా.
– పెమా ఫుంట్సోక్, విద్యార్థిని
ఐదేండ్లుగా ఎదురుచూస్తున్నా..
సరైన ఉద్యోగం దొరుకుతుందేమోనని ఐదేండ్లుగా ఎదురుచూస్తున్నా. కామర్స్లో డిగ్రీ పూర్తి చేసి, ఎస్ఎస్సీ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నా. బతుకుదెరువు కోసం దొరికిన పని చేసుకుంటున్నా.
– స్టాంజిన్ గుర్మత్, ఉద్యోగ అభ్యర్థి