ముంబై : కరోనా కట్టడికి నూరు శాతం వ్యాక్సినేషన్ సాధించాలనే లక్ష్యంతో థానే మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్కు దూరంగా ఉన్న ఉద్యోగులకు జీతం ఇవ్వబోమని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకుని మరో డోసు తీసుకోని వారికీ జీతాలు చెల్లించరాదని మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సమావేశంలో నిర్ణయించారు. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ, మేయర్ నరేష్ మస్కే ఈ సమావేశానికి హాజరయ్యారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులందరూ సంబంధిత కార్యాలయాల్లో తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను విధిగా సమర్పించాలని ఉన్నతాధికారులు అధికారిక ప్రకటనలో కోరారు. నెలాఖరులోగా నగరంలో నూరు శాతం వ్యాక్సినేషన్ చేపట్టే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. నూరుశాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా థానే నగరమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియను మంగళవారం నుంచి ముమ్మరంగా చేపడతామని మేయర్ మస్కే తెలిపారు.