అనంత్నాగ్: జమ్మూ-కశ్మీర్లో లోక్సభ ఎన్నికల తరుణంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అనంత్నాగ్-రాజౌరీ నియోజకవర్గంలో ఈ నెల 25న పోలింగ్ జరగనున్న సమయంలో.. ఈ నియోజకవర్గం పరిధిలోని పూంఛ్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డారు. భారత వాయు సేన (ఐఏఎఫ్) గస్తీ బృందం ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై కాల్పులు జరిపారు. ఐఏఎఫ్ చేసిన ట్వీట్లో తెలిపిన వివరాల ప్రకారం, సురాన్కోట్ ప్రాంతంలోని సనాయ్ టాప్ వైపు వెళ్తున్న ఈ సైనికులపైకి శనివారం సాయంత్రం 6.15 గంటలకు నలుగురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. వీరిలో ఒకరు మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో శనివారం ఓ సైనిక వాహనం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో సైనికాధికారి గురుప్రీత్ సింగ్ ప్రాణాలు కోల్పోగా, మరికొందరు సైనికులు గాయపడ్డారు. సైనిక గస్తీ బృందం ప్రయాణిస్తున్న ఈ వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.