శ్రీనగర్ : కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో పెట్రోలింగ్ బృందంపై దాడి చేయగా.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వీరమరణం పొందారు. దక్షిణ కశ్మీర్ పుల్వామాలోని నాకా పాయింట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. కాల్పుల్లో సబ్ ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టి.. తనిఖీలు నిర్వహిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
ఇంతకు ముందు ఈ నెల 12న శ్రీనగర్ లాల్బజార్ చెక్పోస్టుపై సైతం ఉగ్రవాదులు దాడి చేయగా.. జమ్మూకశ్మీర్కు పోలీస్ విభాగానికి చెందిన ఏఎస్ఐ ముష్తాక్ అహ్మద్ వీరమరణం పొందారు. ఈ ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత మరోసారి ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ నెల 11న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. జైషే మహ్మద్ టాప్ కమాండర్ ఖైజర్ కోకా సైతం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనేక ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల్లో కోకా వాంటెడ్గా ఉన్నాడు.