న్యూఢిల్లీ, మే 7: మణిపూర్లో ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఆర్మీ, అస్సాం రైఫిల్స్ బలగాల పహారాలో పరిస్థితి కుదుటపడుతున్నది. సమస్యాత్మక ప్రాంతమైన చురచాంద్పూర్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు. మరోవైపు, సైనిక బలగాలు డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఇంఫాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. గొడవలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి 23 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 1,500 మందికి పైగా ప్రజలు మణిపూర్ను వీడి అస్సాం సరిహద్దు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు.
కాగా, మైతీ వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం గిరిజనులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో 55 మందికి పైగా మృత్యువాతపడ్డారు. అటు.. మైతీ వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని మార్చి 27న మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. బీజేపీ ఎమ్మెల్యే, మణిపూర్ అసెంబ్లీలో హిల్ ఏరియా కమిటీ (హెచ్ఏసీ) చైర్మన్ డిన్గాంగ్లంగ్ గాంగ్మీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలపై వెంటనే స్టే ఇవ్వాలని కోరారు. కాగా, మణిపూర్ అల్లర్లపై నేడు విచారణ జరపనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది.
మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దాని విధులను నిర్వర్తించడం లేదని ఆయన విమర్శించారు.