Nama Nageswara rao | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): తొమ్మిదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానంపై బుధవారం జరిగిన చర్చ సందర్భంగా నామా మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. కేంద్రం బీజేపీ, బీజేపీయేతర రాష్ర్టాలు అంటూ విపక్ష చూపుతున్నదని, రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నదని, సమాఖ్య వ్యవస్థలో ఈ వైఖరి సరికాదని హితవు పలికారు. దేశంలో నిత్యావసరాల ధరలు అకాశాన్నంటుతున్నాయని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ హయాంలో దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రస్థాయిలో పెచ్చరిల్లిందని అన్నారు. బీఆర్ఎస్ ఎన్డీయే కాదు, ఇండియా కూటమి కాదని, తమ పార్టీ దేశ ప్రజలతో ఉంటుందని నామా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మణిపూర్ అమానుష ఘటనలతో ప్రపంచం ముందు భారత్ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నామా ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ హింసపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని, ముగ్గురు మహిళా మాజీ జడ్జీలతో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. మణిపూర్కు కేంద్రం అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ గణనీయ అభివృద్ధి సాధించిందని నామా అన్నారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని, విభజన చట్టం హామీలు అమలు చేయలేదని ఆక్షేపించారు. బయ్యారం ఉకు పరిశ్రమ ఏర్పాటు చేయలేదని, ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు. కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్, మహారాష్ట్రకు తరలించారని విమర్శించారు. రాష్ట్రంలో ఐఐఎం, గిరిజన యూనివర్సిటీతో పాటు నవోదయ విద్యాలయాలు, మెడికల్ కాలేజీలను ఒక్కటి కూడా కొత్తగా ఏర్పాటు చేయలేదన్నారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి, తెలంగాణకు ఒక కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ భారతదేశంలో లేదా అంటూ కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని, ఈ మేరకు గత తొమ్మిది ఏండ్లలో సీఎం కేసీఆర్తో పాటు తాను కూడా పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశామని, అయితే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఐటీఐఆర్ తెలంగాణకు మంజూరైతే, దానిని కూడా రద్దు చేశారని నామా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని నామా విమర్శించారు. రైతు బంధును కాపీ కొట్టి కిసాన్ సమ్మాన్ యోజన, మిషన్ భగీరథను కాపీ కొట్టి హార్ ఘర్ జల్ పేరుతో కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి ఇంటికీ తాగు నీరు అందిస్తున్న రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, ఈ విషయాన్ని సంబంధిత కేంద్ర మంత్రినే పలుమార్లు పార్లమెంట్ సాక్షిగా చెప్పారని గుర్తుచేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు రూ.24వేల కోట్లు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా.. కేంద్రం ఆ సిఫార్సులను పెడచెవిన పెట్టి ఒక్క పైసా నిధులివ్వలేదు అని మోదీ సర్కార్పై తీరుపై నామా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు విద్యుత్తు కోసం ఆందోళనలు జరిగిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 18,600 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేశామని, విద్యుత్తు కొరత లేకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకొన్నారని పేర్కొన్నారు. వరి ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా ఉన్నదని, కేంద్రం సహకరించకున్నా.. అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పారు.