Mission Bhagiratha | న్యూఢిల్లీ, జూలై 25: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ (జేజేఎం) నత్తనడకన సాగుతున్నది. ఇప్పటి వరకు కేవలం 64.61 శాతం ఇండ్లకు మాత్రమే నల్లా కనెక్షన్లు సమకూర్చింది. దీంతో 2024 నాటికి దేశంలోని వందశాతం గ్రామీణ కుటుంబాలకు నల్లా ద్వారా నీళ్లిస్తామన్న ప్రధాని మోదీ హామీ ఆమడ దూరంలోనే ఆగిపోయింది. జేజేఎం కింద 2023 జూలై 15 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 64.61 శాతం నివాసాలకు మాత్రమే నల్లా నీటిని ఇవ్వగలిగామని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు.
జేజేఎం కింద గ్రామీణ ప్రాంతాల్లో 12.57 కోట్ల కుటుంబాలకు నల్లా కనెక్షన్ ఇచ్చామని కేంద్రం తెలిపింది. కానీ, ఇది పచ్చి అబద్ధం. జేజేఎం పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ 2019 ఆగస్టు 15న ప్రారంభించారు. అప్పటికే దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 3.23 కోట్ల కుటుంబాలకు మంచినీటి నల్లా కనెక్షన్లు ఉన్నాయి. అంటే జేజేఎం కింద నాలుగేండ్లలో ఇచ్చిన కన్షెక్షన్లు 9.34 కోట్లు మాత్రమే. ఇందులోనూ సగం భారం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాయి. జేజేఎం ప్రారంభానికి ముందే తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ప్రతి ఇంటికి నళ్లా నీళ్లిచ్చింది. మరికొన్ని రాష్ర్టాలు కూడా సొంత పథకాలను అమలుచేశాయి. ఈ లెక్కన చూస్తే జేజేఎం ద్వారా కేంద్రం 20 శాతం ఇండ్లకు కూడా నీళ్లివ్వలేదని పరిశీలకులు అంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వందశాతం నివాసాలకు నల్లాద్వారా సురక్షిత తాగునీరు అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి షెకావత్ పార్లమెంటులో స్వయ ంగా చెప్పారు. తెలంగాణ, దాద్రా నగర్ హవేలీ, డామన్-డయ్యూ, గోవా, గుజరాత్, హర్యానా, అండమాన్-నికోబార్ మాత్రమే ఈ ఫీట్ సాధించాయి. కొన్ని రాష్ర్టాలు మాత్రం 50 శాతం కూడా కనెక్షన్లు ఇవ్వలేక వెనుకబడిపోయాయి. పశ్చిమబెంగాల్ (34.23 శాతం), జార్ఖండ్ (38.64 శాతం), రాజస్థాన్ (40.96 శాతం), కేరళ (49.73 శాతం) కనెక్షన్లే ఇచ్చాయి. లక్షద్వీప్లో ఒక్క ఇంటికి కూడా నల్లా కనెక్షన్ లేదని కేంద్రం తెలిపింది.