తుగ్లక్, ఔరంగజేబులను మించి మోదీ సర్కారు బాదుతున్న పన్నుల మోతపై తెలంగాణ రాష్ట్ర సమితి ఢిల్లీ నుంచి గల్లీ దాకా నిరసనల మోత మోగించింది. పన్నులమీద పన్నులు, ధరల పెంపుతో పేదల రక్తం పీల్చుతున్న కేంద్రం, తాజాగా పాలు, అనుబంధ ఉత్పత్తులపై పన్నుపోటు వేయడంపై టీఆర్ఎస్ భగ్గుమన్నది. సామాన్య ప్రజలపై కక్షగట్టిన బీజేపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
పార్లమెంటు లోపలా, బయటా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన గులాబీ శ్రేణులు కేంద్రం తీరుపై భగ్గుమన్నాయి. కేంద్రం తీరుపై తిరగబడ్డాయి. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపు మేరకు టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి ప్రజాప్రతినిధుల వరకు రహదారులపై రణన్నినాదం చేశారు.
మోదీని ఏమని పిలవాలి?
ద్రవ్యోల్బణాన్ని, దేశంలోకి అక్రమ చొరబాట్లను నియంత్రించలేని ప్రధానిని ఏమని పిలుస్తారు?అని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్లో ప్రశ్నించారు. ఆప్షన్ ఏ) 56 ఇంచుల ప్రధాని, బీ) విశ్వగురు, సీ) అచ్చేదిన్ వాలే, డీ) పైవన్నీ అన్పార్లమెంటరీ పదాలు కాబట్టి ఆ సమాధానాలను తొలగించాం అంటూ 4 ఆప్షన్స్ ఇచ్చారు.
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): పాలపై పన్ను.. వెన్నపై పన్ను.. నెయ్యిపై పన్ను.. పెరుగుపై పన్ను.. ఇలా కనపడ్డ ప్రతి వస్తువుపైనా పన్నువేటు వేసిన మోదీ సర్కారుపై టీఆర్ఎస్ పార్టీ తిరగబడింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా గులాబీ సైన్యం కదం తొక్కింది. పాలు, పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. పాలు, పాల ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీఎస్టీ విధించిన నేపథ్యంలో కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టాలని ఆయన కోరా రు. రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు, పాల ఉత్పత్తుల పైన పన్ను విధించడం వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ.. అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, ఈ నిరసనల్లో రైతులను ముఖ్యం గా పాడి రైతులను భాగస్వాములు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీని నిరసిస్తూ మహబూబ్నగర్లో పాల డబ్బాలతో నిరనస తెలుపుతున్న మంత్రి శ్రీనివాస్గౌడ్, వ్యాపారులు
ఊరూవాడా ఏకం
మంత్రి కేటీఆర్ పిలుపుతో జీఎస్టీ పన్ను పెంపునకు నిరసనగా మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు సహా పార్టీ శ్రేణులు, రైతులు రోడ్ల మీదికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రహదారులన్నీ రణరంగాన్ని తలపించాయి. పెంచిన పన్నును కేంద్రం ఉపసంహరించుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. పార్టీ పిలుపు ఇచ్చిన కొద్ది గంటల్లోనే రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులన్నీ ప్రజలను ఏకం చేసి వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మండల, జిల్లా కేంద్రాల్లో గులాబీ శ్రేణులు కేంద్ర పన్నుల విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి రాస్తారోకోలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లాకేంద్రంలోని ఐబీ చౌరస్తాలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. బర్రెలకు నిత్యావసర సరుకులు కట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. హాజీపూర్, లక్షెట్టిపేటలో టీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఆధ్వర్యంలో పాలక్యాన్లతో జీఎస్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీఆర్ఎస్ నాయకులు పాలల్లో రొట్టెలు వేసుకుని తింటూ నిరసన చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పెంపును నిరసిస్తూ బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేంద్రంలో రాస్తారోకో చేస్తున్న మంత్రి మల్లారెడ్డి. చిత్రంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఆర్ఎస్ నాయకులు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రధాని దిష్టి బొమ్మను దహనం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు
నిజామాబాద్లో నిరసనలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. కమ్మర్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నేతలు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. నందిపేట మండలం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. నిజాంసాగర్లో ధర్నా నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. లింగంపేట మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ధర్నాలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ పాల్గొన్నారు.
కరీంనగర్లో ఆగ్రహజ్వాల
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. రోడ్లెక్కి బైఠాయించాయి. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో మేయర్ సునీల్రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, కార్పొరేటర్లతో కలిసి నినదించారు. పాలు కింద పారబోసి నిరసన తెలిపారు. ‘మోదీ డౌన్ డౌన్’ అంటూ చిన్నారులు నినదించారు. మానకొండూర్లో జడ్పీచైర్పర్సన్ విజయ, జీవీ రామకృష్ణారావు నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ నిరసన తెలిపారు. మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద 63వ జాతీయ రహదారిపై టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. కోరుట్ల పట్టణంలో ర్యాలీ తీశారు.
వరంగల్లో దిష్టిబొమ్మ దహనం
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా బుధవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. ప్రధాని మోదీ, కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అదాలత్, కేయూ జంక్షన్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మోదీ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాజీపేట, ముల్కనూరు, హసన్పర్తి, ఎల్కతుర్తి, కమలాపూర్లో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా, రాస్తారోకో నిర్వహించాయి. వరంగల్లోని వీధివీధినా ధర్నా చేశారు. నర్సంపేట, రాయపర్తి, పర్వతగిరి, వర్ధన్నపేట పట్టణంలో నిరసనలు జరిగాయి. వర్ధన్నపేట దగ్గర జాతీయ రహదారిపై ధర్నాలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొన్నారు. బర్రెలను తీసుకువచ్చి నిరసన తెలిపారు. జనగామలో పాలక్యాన్తో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి రాస్తారోకో నిర్వహించారు. స్టేషన్ఘన్పూర్లో, ములుగులో నిరసన చేపట్టారు.
నల్లగొండలో నిరసనల హోరు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం నిరసనలు వెల్లువెత్తాయి. రైతులు, నాయకులు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. తుర్కపల్లి, మోత్కూరు, దేవరకొండ, నల్లగొండ, త్రిపురారం, తుంగతుర్తిలో రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. వెంటనే పెంచిన జీఎస్టీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పీల్చే గాలికి జీఎస్టీ వేస్తారేమో..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. తెలంగాణ చౌరస్తా లోపాలను పారబోసి ఖాళీ పాలక్యాన్లు పట్టుకుని ధర్నా చేశాయి. నారాయణపేటలో పార్టీ నాయకులు వినూత్న రీతిలో ధర్నాకు దిగారు. గేదెను తీసుకొచ్చి ఖాళీ పాలక్యాన్లతో నిరసన వ్యక్తం చేశారు. పసిపిల్లలు తాగే పాలపై కేంద్రం జీఎస్టీ విధించడం చూస్తుంటే మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో పీల్చే గాలిపై కూడా జీఎస్టీ విధించినా.. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.