Telangana | న్యూఢిల్లీ, నవంబర్ 19: అభివృద్ధిలో, సంపద సృష్టిలో దేశానికే మార్గదర్శనం చేస్తున్న తెలంగాణ మరో ఘనత సాధించింది. దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో అత్యధిక తలసరి ఎన్ఎస్డీపీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ తన అప్రతిహత జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. రూ.3.08 లక్షలతో టాప్లో నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ, తలసరి జీడీపీలోనూ పెద్దపెద్ద రాష్ర్టాలను వెనక్కు నెట్టింది. ఈ వివరాలు వెల్లడించింది ఏదో ఆశామాషీ వ్యక్తులు కాదు.
ప్రపంచం ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్. భారత రాష్ర్టాల జీడీపీ, తలసరి జీడీపీపై ఆ సంస్థ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఏ రాష్ట్ర జీడీపీ ఎంత? తలసరి జీడీపీ ఎంత అనేది స్పష్టంగా పేర్కొంటూ ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో చిన్నరాష్ర్టాలైన సిక్కిం, గోవా తర్వాతే తెలంగాణ టాప్లో నిలిచింది. ఒక ప్రాంతంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు, సేవలను ఆ ప్రాంత జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి జీడీపీ. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఫోర్బ్స్ ఈ జాబితాను విడుదల చేసింది.