Tejashwi Yadav : ప్రధాని నరేంద్ర మోదీ మాటలకు, చేతలకు పొంతన ఉండదని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ దుయ్యబట్టారు. బిహార్లో ప్రధాని మోదీ తొలి ర్యాలీలో ఆయన వ్యాఖ్యలను ఉద్దేశించి తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని బంధుప్రీతికి వ్యతిరేకంగా మాట్లాడారా అని ప్రశ్నించారు. ప్రధాని తన కూటమికి చెందిన కుటుంబ వారసత్వ అభ్యర్ధికి మద్దుతగా ప్రచారం చేశారని, మోదీ మాటలకు, చేతలకు పొంతన ఉండదని తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు.
మోదీ తన ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ వారసత్వ రాజకీయాలపై మాట్లాడతారని, కానీ బిహార్లో తన తొలి ప్రచార సభలోనే వారసత్వ రాజకీయ నేత తరపున ప్రచారం చేశారని విమర్శించారు. ప్రధాని మాటలకు, చేతలకు తేడా ఉంటుందని ఇది తేటతెల్లం చేస్తుందని అన్నారు. ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరితే వారిపై సీబీఐ, ఈడీ కేసులు మూసివేస్తారని, వారిని మంత్రులుగా చేస్తారని అన్నారు.
రూ. 70,000 కోట్ల స్కామ్లో ప్రమేయం ఉన్నవారైనా వారిని పార్టీలోకి చేరగానే మంత్రులుగా ప్రమోట్ చేస్తారని చెప్పారు. ఇక బిహార్లో రానున్న లోక్సభ ఎన్నికలకు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమి బీజేపీతో తలపడుతోంది. రాష్ట్రంలోని 40 లోక్సభ స్ధానాలకు గాను ఆర్జేడీ 26 స్ధానాల్లో పోటీ చేస్తోంది. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :