పట్నా : బిహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం కూలిపోవాలన్నది రాష్ట్ర ప్రజల ఆకాంక్షని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. నితీష్ సర్కార్ త్వరలోనే కుప్పకూలుతుందని అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికి అనుకూలంగా ఓటర్లు తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ సింగ్ జేడీయూను వీడి తేజస్వి సమక్షంలో శనివారం తిరిగి ఆర్జేడీలో చేరారు.
ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పెద్దసంఖ్యలో నేతలు జేడీయూ నుంచి బయటకు రానున్నారని తెలిపారు. సీనియర్ నేత మహేశ్వర్ తిరిగి ఆర్జేడీ గూటికి చేరడం సానుకూల పరిణామమని స్వాగతించారు. పార్టీలో కొనసాగాలని తనపై తీవ్ర ఒత్తిళ్లు ఎదురైనా ఆర్జేడీలో చేరాలని గట్టిగా నిర్ణయించుకున్నానని మహేశ్వర్ సింగ్ పేర్కొన్నారు. తూర్పు చంపరాన్ జిల్లాలో తన అనుచరులు కూడా త్వరలో ఆర్జేడీలో చేరతారని చెప్పారు.