Tejashwi Yadav : రానున్న లోక్సభ ఎన్నికలకు బిహార్ మహాకూటమి పొత్తలపై మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక వివరాలు వెల్లడించారు. ఆర్జేడీ 26 స్ధానాల నుంచి పోటీ చేస్తుందని అయితే తమ పార్టీ కోటా నుంచి మూడు స్ధానాలను ముఖేష్ సాహ్ని పార్టీకి కేటాయించాలని నిర్ణయించామని చెప్పారు.
గోపాల్గంజ్, ఝంఝాపూర్, మోతిహారి స్ధానాలను ముఖేష్ సాహ్ని పార్టీకి కేటాయించామని తెలిపారు. ఇక తేజస్వి యాదవ్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ప్రధాని మాటలకు, చేతలకు పొంతన ఉండదని దుయ్యబట్టారు. బిహార్లో ప్రధాని మోదీ తొలి ర్యాలీలో ఆయన వ్యాఖ్యలను ఉద్దేశించి తేజస్వి యాదవ్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని బంధుప్రీతికి వ్యతిరేకంగా మాట్లాడారా అని ప్రశ్నించారు.
ప్రధాని తన కూటమికి చెందిన కుటుంబ వారసత్వ అభ్యర్ధికి మద్దుతగా ప్రచారం చేశారని, మోదీ మాటలకు, చేతలకు పొంతన ఉండదని తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు. మోదీ తన ఎన్నికల ప్రచారంలో ఎప్పుడూ వారసత్వ రాజకీయాలపై మాట్లాడతారని, కానీ బిహార్లో తన తొలి ప్రచార సభలోనే వారసత్వ రాజకీయ నేత తరపున ప్రచారం చేశారని విమర్శించారు. ప్రధాని మాటలకు, చేతలకు తేడా ఉంటుందని ఇది తేటతెల్లం చేస్తుందని అన్నారు. ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరితే వారిపై సీబీఐ, ఈడీ కేసులు మూసివేస్తారని, వారిని మంత్రులుగా చేస్తారని అన్నారు.
Read More :