పట్నా : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ శనివారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో విపక్ష నేతలపై ఇక ఈడీ, ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తారని బిహార్ విపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కాషాయ పార్టీపై ధ్వజమెత్తారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ చెప్పినట్టు బీజేపీ అంటే బడా ఝూటా పార్టీ అని ఆయన అభివర్ణించారు.
ఇక అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. యూపీలో ఏడు దశల్లో పోలింగ్ జరగనుండగా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాలో ఒక దశలో పోలింగ్ జరగనుంది. ఇక మణిపూర్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనుండగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడవుతాయి.
కొవిడ్-19 కేసులు అనూహ్యంగా పెరుగుతున్నందున ఈనెల 15 వరకూ రాజకీయ పార్టీల రోడ్షోలు, ర్యాలీలు, బహిరంగ సభలపై ఈసీ నిషేధం విధించింది. ఆపై క్షేత్రస్ధాయి పరిస్ధితులను సమీక్షించిన అనంతరం ఈసీ తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.