Tejaswi Yadav | ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ బీహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఆధారాలు లభిస్తే బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. యూపీఏ-1 ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు ఆ శాఖలో ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని సీబీఐ అధికార వర్గాలు తెలిపాయి. ఆధారాలు లభిస్తే ఇది అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా ఉండొచ్చునని చెబుతున్నారు.
రైల్వేశాఖలో ఉద్యోగాల కోసం యాదవ్లకు 1458 మంది భూములిచ్చారని తెలుస్తున్నది. ఇటీవల సీబీఐ జరిపిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న హార్డ్డిస్క్లో ఈ జాబితా ఉన్నదని సమాచారం. వీరిలో 16 మంది సీబీఐ దర్యాప్తును ధృవీకరించారని చెబుతున్నారు. యాదవ్లు తమ బంధుమిత్రుల పేరిట ఈ భూములు స్వాధీనం చేసుకున్నారని, తర్వాత భూమిని సొంతం చేసుకున్నారని అధికార వర్గాలు చెప్పాయి.
ఇలా ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో బయటపడిన వారెవరైనా ఉన్నారా? అని సమాచారం సేకరించాలని రైల్వేశాఖకు సీబీఐ లేఖ రాయనున్నది. తదుపరి దశలో రైల్వేశాఖ ఉద్యోగుల అవినీతిపై సీబీఐ దర్యాప్తు చేయనున్నది. సాక్షాధారాలు బలంగా ఉంటే బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.