లక్నో: అన్నను మొసలి బారి నుంచి తమ్ముడు కాపాడాడు. ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని మధోతండా ప్రాంతంతో ఈ ఘటన జరిగింది. సోదరులైన వికాస్, నీరజ్ శుక్రవారం వ్యవసాయ పనుల అనంతరం చేతులు కడుక్కునేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. అంతలో ఒక మొసలి వికాస్ కాలును నోటితో పట్టింది. చెరువులోకి అతడ్ని లాగేందుకు ప్రయత్నించింది. దీంతో వికాస్ భయంతో కేకలు వేశాడు.
అప్రమత్తమైన సోదరుడు నీరజ్ ఒక పెద్ద బండరాయిని తీసుకుని మొసలి మీదకు విసిరాడు. దీంతో అది వికాస్ కాలిని విడిచి నీటిలోకి వెళ్లిపోయింది. అనంతరం వికాస్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతడికి ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.
కాగా, వ్యవసాయ చెరువు గట్టున ఉన్న మొసలిని తాము గమనించలేదని అటవీశాఖ అధికారులకు నీరజ్ తెలిపాడు. దీంతో అది తన సోదరుడిపై దాడి చేసిందని వివరించాడు.