Kejriwal-ED | మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేయకుండా నివారించాలని సుప్రీంకోర్టులో ఆప్ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ పిటిషన్ మీద తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో శుక్రవారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, కేజ్రీవాల్ నివాసానికి వచ్చే అన్ని రహదారులను ఢిల్లీ పోలీసులు మూసివేశారు. కేజ్రీవాల్ ఇంట్లోకి వెళ్లేందుకు ఢిల్లీ మంత్రులను ఈడీ అధికారులు అనుమతించడం లేదు. మరోవైపు ఈడీ కార్యాలయానికి వచ్చేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు. దీంతో మరో ఈడీ అధికారుల టీం కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నది. కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు వచ్చారన్న సమాచారం తెలుసుకున్న ఆప్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో కేజ్రీవాల్ ఇంటి వద్ద 144 సెక్షన్ విధించారు.