బీజేపీ పాలిత కర్ణాటకలో ఘటన
బెంగళూరు, జూన్ 26: తమ గ్రామానికి ఎరువుల కొరత ఉన్నదని, వెంటనే ఎరువులు పంపే ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన ఓ ప్రభుత్వ టీచర్ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన బీజేపీ పాలిత కర్ణాటకలో చోటుచేసుకొన్నది. బీదర్ జిల్లా హెడపురా గ్రామానికి చెందిన ప్రభుత్వ టీచర్ కుశాల్ పాటిల్ కుటుంబానికి వ్యవసాయం కూడా ఉన్నది. ఆ గ్రామంలో రైతులు తీవ్రమైన ఎరువుల కొరత ఎదుర్కొంటున్నారు. దీంతో కుశాల్ ఇటీవల కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబకు ఫోన్చేసి తమ గ్రామానికి ఎరువులు పంపాలని విజ్ఞప్తి చేశారు.
అన్ని ప్రాంతాలకు ఎరువుల సరఫరా జరిగిపోయిందని, కొరత ఉంటే స్థానిక ఎమ్మెల్యేను అడగాలని కుశాల్కు మంత్రి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. మంత్రి స్పందనపై సంతృప్తి చెందని కుశాల్.. బీదర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మీకు.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయబోమని తన అసహనాన్ని వ్యక్తం చేశారు. దీంతో మంత్రి కుశాల్పై ఆగ్రహం వ్యక్తంచేశారు. గత గురువారం కర్ణాటక విద్యాశాఖ కుశాల్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది.