కోల్కతా : కాలినడకన కోల్కతా నుంచి 2500 కిలోమీటర్ల దూరంలోని లడఖ్కు చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. టీ విక్రయించి పొట్టపోసుకునే మిలన్ మాఝీ కేవలం 82 రోజుల్లోనే ఈ సాహస యాత్రను పూర్తిచేశాడు. లడఖ్కు బైక్పై వెళ్లాలనేది మిలన్ మాఝీ కల కాగా, బైక్ను కొనడం తన కుటుంబానికి తలకు మించిన భారం కావడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. బైక్ లేకపోవడం తన ప్రయాణానికి ఎంతమాత్రం ఆటంకం కాదని ఫిబ్రవరి 22న హౌరా బ్రిడ్జి నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన మిలన్ మే 15న లడఖ్లోని ఖర్ధుంగ్లా పాస్లో అడుగుపెట్టాడు.
కాలినడకన మిలన్ రోజుకు ఏకంగా 30 కిలోమీటర్లు ప్రయాణించాడు. వంద రోజుల్లో తన ప్రయాణాన్ని ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్న మిలన్ 82 రోజుల్లోనే యాత్రను విజయవంతంగా ముగించాడు. గమ్యస్ధానానికి చేరుకునేలా మిలన్కు పలు స్వచ్ఛంద సంస్ధలు, సేవా సంస్ధలు సహకరించాయి. మిలన్ యాత్ర గురించి తెలుసుకున్న పలువురు అతడికి అవసరమైన వసతి, భోజన ఏర్పాట్లు సమకూర్చారు. తన కుమారుడు లడఖ్ కాలినడకన వెళతాడని తనకు తెలియదని మిలన్ తండ్రి అనిల్ మాఝీ చెప్పుకొచ్చారు.
ఓసారి బైక్పై లడఖ్ వెళ్లాలనుకున్నా అప్పట్లో అంతమొత్తం లేనందున వెనక్కితగ్గాడని, అప్పటి నుంచే కాలినడకన లడఖ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడని తెలిపారు. తాను హౌరా నుంచి జార్ఖండ్, బిహార్, యూపీ, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మీదుగా లడఖ్ చేరుకున్నానని మిలన్ తన యాత్రను గుర్తుచేసుకున్నాడు. రోజుకు 35 నుంచి 40 కిలోమీటర్ల వరకూ నడిచానని, భోజన ఏర్పాట్లు ఎక్కడికక్కడ స్ధానికులు చూశారని చెప్పాడు. తాను కేవలం రూ 2100తో ఇంటి నుంచి బయలుదేరానని, మందులు, స్వెట్టర్ల వంటివి కొనుగోలు చేశానని అన్నాడు. కేరళ నుంచి వచ్చిన బైకర్ టీం వద్ద ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నా తనకు ఆ అవసరం రాలేదని చెప్పాడు.