న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను చలి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోవడంతో జనం గజగజ వణికిపోతున్నారు. హిమాలయాలకు సమీపంలో ఉండటంతో దేశ రాజధాని ఢిల్లీతోపాటు జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. దాంతో జనం చలిమంటలు వేసుకుంటూ, వేడివేడి చాయ్, కాఫీలు లాగిస్తూ ఒంట్లో వేడిని పెంచుకుంటున్నారు.
పంజాబ్లో చలికితోడు దట్టమైన పొగమంచు కూడా దాపురించింది. పొగమంచు కారణంగా విజుబిలిటీ సరిగా లేక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అమృత్సర్లో పొగమంచు కారణంగా ఉదయం ఎనిమిది గంటల వరకు చీకట్లు వీడలేదు. ఇప్పుడే పరిస్థితి ఈ రకంగా ఉంటే డిసెంబర్ చివరికల్లా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, అప్పటి పరిస్థితి ఏందని జనం ఆందోళన చెందుతున్నారు.