కోల్కతా: రెండు విమానాలు రన్వే పై చాలా దగ్గరగా వచ్చాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల రెక్కలు ఢీకొన్నాయి. (Two aircrafts dangerously close) దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్క భాగం విరిగిపోయింది. ఇండిగో విమానంలో ఉన్న ప్రయాణికులకు పెను ముప్పు తప్పింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం దర్భంగా వెళ్లే ఇండిగో విమానం ట్యాక్సింగ్ కోసం ప్రయత్నించింది. అయితే రన్వేలోకి ప్రవేశించడానికి క్లియరెన్స్ కోసం ఆగి ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని అది ఢీకొట్టింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కకు, ఇండిగో విమానం రెక్క బలంగా తగిలింది. దీంతో ఎయిర్ విమానం రెక్క భాగం తెగిపోగా, ఇండిగో విమానం రెక్క వంకర పోయింది. ఆ సమయంలో ఇండిగో విమానంలో నలుగురు శిశువులతో సహా 135 మంది ప్రయాణికులన్నారు. ఈ సంఘటన వల్ల దర్భంగా విమానం టేకాఫ్ ఆలస్యమైనట్లు ఇండిగో సంస్థ పేర్కొంది.
కాగా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ సంఘటనపై స్పందించింది. రెండు విమాన సంస్థల నుంచి రిపోర్ట్ కోరింది. రెండు విమానాల పైలట్లను విధుల నుంచి తప్పించాలని ఆదేశించింది. సమగ్ర చెకింగ్ కోసం రెండు విమానాలను గ్రౌండింగ్ చేయాలని చెప్పింది. దర్యాప్తులో భాగంగా గ్రౌండ్ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తామని డీజీసీఏ పేర్కొంది.