Nitin Gadkari | పన్ను తగ్గింపులు కోరవద్దని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కార్ల పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వానికి డబ్బు అవసరమన్నారు. భారత్లో లాజిస్టిక్స్ ఖర్చు రెండేళ్లలోపు 9శాతానికి తగ్గుతుందన్నారు. జీఎస్టీ, ఇతర పన్నులు తగ్గించాలని డిమాండ్ చేయొద్దన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని.. పన్నులు తగ్గిస్తే.. మరింత డిమాండ్ చేస్తారన్నారు. ఇది మానవ మస్తత్వం అన్నారు. తాము పన్నులను తగ్గించాలని అనుకుంటున్నామని.. కానీ పన్నులు లేకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయలేదన్నారు. ధనవంతుల నుంచి పన్నులు తీసుకొని పేదలకు ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ దార్శనికత అని.. ప్రభుత్వానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయన్నారు.
ప్రస్తుతం దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు 14-16 శాతంగా ఉందని.. రాబోయే రెండేళ్లలోపు లాజిస్టిక్స్ ఖర్చు 9శాతానికి తగ్గుతుందని హామీ ఇచ్చారు. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో మరింత పోటీతత్వాన్ని కలిగి ఉంటామన్నారు. చైనాలో లాజిస్టిక్స్ ఖర్చు 8శాతం ఉండగా.. అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఇది 12 శాతం ఉందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా భారత పరిశ్రమ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. మూలధన పెట్టుబడిని పెంచడం ద్వారా భారతదేశం మరిన్ని ఉద్యోగాలను సృష్టించబోతోందని చెప్పారు. ‘మీరంతా సంపద సృష్టికర్తలు మాత్రమే కాదు.. ఉద్యోగ సృష్టికర్తలు’. ఈ స్వర్ణ యుగాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి’ అంటూ పిలుపునిచ్చారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు దిగుమతులను తగ్గించి.. ఎగుమతులను పెంచాల్సిన అవసరాన్ని గడ్కరీ నొక్కి చెప్పారు.