న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఇప్పటివరకూ జీవిత బీమా పాలసీలను పన్ను రహిత పొదుపు సాధనాలుగా పరిగణిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రజలపై వడ్డింపులకు తెగబడింది. ఇకనుంచి రూ.5 లక్షలకుపైగా వార్షిక ప్రీమియం చెల్లించే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై (యూనిట్ లింక్డ్ పాలసీలు మినహా) కాలపరిమితి ముగిసిన తర్వాత అందే మొత్తానికి ఆదాయపు పన్ను పడుతుంది. ఈ కొత్త పన్ను 2023 ఏప్రిల్ 1 నుంచి తీసుకునే పాలసీలకు వర్తిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కొవిడ్ పాండమిక్ కారణంగా రెండేండ్లుగా ఆరోగ్య బీమా పాలసీలతో పాటు జీవిత బీమా పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరిగింది. దీనిని సొమ్ముచేసుకునేందుకు కొత్తగా పన్ను విధించింది. రూ.5 లక్షల లోపు వార్షిక ప్రీమియం చెల్లింపులపై అందుకునే మెచ్యూరిటీ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుందని, బీమా ఉన్న వ్యక్తి పాలసీ అమలుకాలంలో మరణిస్తే అందించే బీమా మొత్తంపై పన్ను ఉండదని ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే 2023 మార్చి 31 వరకూ జారీ అయిన బీమా పాలసీలకు పన్ను వర్తించదన్నారు.
రెండు పాలసీలు తీసుకున్నా ట్యాక్స్ తప్పదు
జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీ మొత్తంపై పన్ను ప్రతిపాదించడం పాలసీదార్లకు పెద్ద దెబ్బ అని ఫైనాన్షియల్ అడ్వయిజరీ సంస్థ ఫింటూ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ నిధి మాన్చందా చెప్పారు. 2023 ఏప్రిల్ 1 తర్వాత తీసుకునే పాలసీల వార్షిక ప్రీమియం రూ.5 లక్షలు మించితే..పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత వచ్చే మొత్తంపై పన్ను పడుతుందన్నారు. బడ్జెట్ ప్రతిపాదనను నిధి వివరిస్తూ తక్కువ ప్రీమియంతో ఒక వ్యక్తి ఒకటికి మించి పాలసీలు తీసుకుంటే, ఆ పాలసీల మొత్తం ప్రీమియం చెల్లింపు రూ.5 లక్షలు దాటినా మెచ్యూరిటీ మొత్తంపై పన్ను విధింపు ఉంటుందన్నారు. ఈ పన్ను ప్రతిపాదన వెలువడినంతనే బుధవారం స్టాక్ ఎక్సేంజీల్లో జీవిత బీమా సంస్థల షేర్లు పతనమయ్యాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ 11 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 10 శాతం చొప్పున పడిపోయాయి. ఎల్ఐసీ 8 శాతం క్షీణించింది.