Tata Motors : ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) లిమిటెడ్ తమిళనాడు (Tamil Nadu) లో కొత్త తయారీ కేందాన్ని ప్రారంభించారు. రాణిపేట (Ranipet) జిల్లాలోని పాణపక్కంలో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్ను సోమవారం తెరిచారు. కార్యక్రమంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ పాల్గొన్నారు. రాబోయే 5-7 ఏళ్లలో ఈ ప్లాంట్ ద్వారా 2.5 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ ప్లాంటుపై రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్తోపాటు, దాని అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) కు చెందిన కార్లనూ ఇక్కడే తయారుచేస్తారు. దశలవారీగా ఉత్పత్తి కార్యకలాపాలను పెంచనున్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఇక్కడి నుంచే సరఫరా చేస్తారు. ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానికంగా రూపొందిన రేంజ్ రోవర్ ఎవోక్ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
తమిళనాడుతో టాటా గ్రూప్కు సుదీర్ఘ అనుబంధం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఉద్యోగావకాశాలు కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా పరిశ్రమలో తయారైన ల్యాండ్ రోవర్ కారును స్టాలిన్ స్వయంగా డ్రైవ్ చేశారు.