Chennai Rains | ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై నగరంలో గత 72 ఏళ్లలో ఇంతటి వర్షం కురవడం ఇది మూడోసారి అని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై నగరంలో కురిసిన వర్షాల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు ప్రాణాలుకోల్పోగా… ఇంటి పై కప్పు కూలి ఓ మహిళ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో కాంచీపురం, తిరువళ్లూరులో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు చెన్నై, కాంచీపురం, చంగల్పట్టు, తిరువళ్లూరు, తంజావూర్, తిరువరూర్, నాగపట్నంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఉత్తర శ్రీలంక తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈశాన్య రుతుపవనాల వర్షాల కారణంగా రానున్న ఐదు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.