న్యూఢిల్లీ, మార్చి 21: ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. గురువారం విడుదల చేసిన మూడో జాబితాలో తమిళనాడు నుంచి పోటీ చేసే 9 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి బరిలో దిగనున్నారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్.. నీలగిరి నుంచి, సీనియర్ నేతలు పొన్ రాధాకృష్ణన్, ఏసీ షణ్ముగం వరుసగా కన్యాకుమారి, వెల్లూరి నుంచి పోటీ చేయనున్నారు. తమిళనాడులో ఈసారి ఎలాగైనా బోణీ కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్న బీజేపీ.. రాష్ట్రంలోని వివిధ చిన్న పార్టీలతో పొత్తు కుదుర్చుకున్నది. పొత్తులో భాగంగా 20 సీట్లలో బీజేపీ, 10 సీట్లలో పీఎంకే, మూడింటిలో టీఎంసీ, రెండింటిలో ఏఎంఎంకే, ఐజేకే, ఎన్జేపీ రెండు చొప్పున, రెండు చిన్న పార్టీలు తలో సీటులో పోటీ చేస్తాయి.