Nirmala Sitharaman | ఆకాశాన్నంటుతున్న ఉల్లిధరల గురించి ప్రశ్నిస్తే.. తాను పెద్దగా ఉల్లిగడ్డలు తిననని.. పతనమైన ఆర్థిక వ్యవస్థ గురించి ప్రశ్నిస్తే.. కరోనా మహమ్మారి దేవుడి చర్య అని, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిందని తప్పించుకున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. ఇప్పుడు గ్యాస్ ధరలపైనా అదేవిధంగా సమాధానమిచ్చారు. వంటగ్యాస్ ధరలు తమ చేతుల్లో ఉండవని, అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా మారుతూ ఉంటాయని కొత్త ఆర్థిక సూత్రాన్ని చెప్పుకొచ్చారు.
కాంచీపురం, ఏప్రిల్ 3: వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తమిళనాడులోని కాంచీపురం జిల్లా పళయాసివరం గ్రామంలో పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మలకు నిరసన సెగ తగిలింది. స్థానిక మహిళలు కేంద్రమంత్రిని చుట్టుముట్టి.. వంట గ్యాస్ ధరలపై గట్టిగా నిలదీశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేశారని, వెంటనే వాటిని తగ్గించాలని డిమాండ్ చేశారు. దీంతో అవాక్కయిన మంత్రి.. తనకు అలవాటైన రీతిలో తప్పించుకునే ప్రయత్నం చేశారు. వంటగ్యాస్ ధరలు తమ చేతుల్లో ఉండవని, అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా మారుతూ ఉంటాయని చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి మీకు అందుతుందా? అని సీతారామన్ గ్రామస్తులను అడుగ్గా.. ముందు గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. దీంతో అవాక్కయిన మంత్రి.. వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. వంట గ్యాస్ ధరలు తమ చేతుల్లో ఉండవని, అవి, అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా మారుతుంటాయని చెప్పారు. ‘మన దేశంలో వంట గ్యాస్ ఉత్పత్తి కాదు. మనం దిగుమతి చేసుకుంటాం. దిగుమతి చేసుకొనే క్రమంలో అక్కడ ధరలు పెరిగితే మన దేశంలో కూడా పెరుగుతాయి. అక్కడ తగ్గితే.. ఇక్కడ కూడా తగ్గుతాయి. గత రెండేండ్ల నుంచి గ్యాస్ ధరలు తగ్గలేదు’ అని అన్నారు.
ధరల మోత పనిలో కేంద్రం
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీ ప్రభుత్వం ప్రజలను ధరల మోతతో బాదే పనిలో ఉన్నది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇష్టానుసారం పెంచేస్తూ సామాన్యులను ఇబ్బందుల్లోకి నెడుతున్నది. ఇటీవలనే గత నెల 1న కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై మరో రూ.50 పెంచిన విషయం తెలిసిందే. వాణిజ్య సిలిండర్పై ఏకంగా రూ.350 పెంచేసింది. దీంతో గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సబ్సిడీ ధర హైదరాబాద్లో రూ.1,155కి చేరింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి, అంటే 2014లో రూ.410గా ఉన్న 14.2 కేజీల వంటగ్యాస్ ధర 2023, మార్చికి దాదాపు మూడు రెట్లు పెరిగి రూ.1,155కి చేరింది. కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చే నాటికి 2014లో అంతర్జాతీయంగా సహజవాయువు ధర బ్యారెల్కు 6 డాలర్లు ఉన్నప్పుడు దేశంలో సిలిండర్ గ్యాస్ ధర రూ.410 వరకు ఉన్నది. ప్రస్తుతం అంతర్జాతీయంగా గ్యాస్ధర బ్యారెల్కు 2.67 డాలర్లు ఉండగా, సిలిండర్ ధర మాత్రం రూ.1100 దాటింది. అంతర్జాతీయ ధరలతో నిమిత్తం లేకుండా మోదీ సర్కార్ గ్యాస్ ధరలను పెంచుతున్నది.